అంబర్పేట : ముద్ర సొసైటీ బ్యాంకుగా మారుతుందని, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డిపాజిట్గా తీసుకున్న మొత్తం తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సొసైటీ చైర్మన్ తిప్పనేని రామదాసప్ప నాయుడుపై నల్లకుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా శుక్రవారం అతను పోలీసులకు లొంగిపాయాడు.
గత ఏడాది ఫిబ్రవరి 19 న అతనిపై నమోదైన కేసులో నల్లకుంట పోలీసులు ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీలెవెల్ కో-ఆపరేటివ్ సొసైటి లిమిటెడ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి అందులో ఉన్న దస్తావేజులు, పత్రాలు, ఉద్యోగం కోసం పెట్టిన నిరుద్యోగుల సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వివరాల కోసం లొంగిపోయిన రామదాసప్ప నాయుడును విచారిస్తున్నారు. అతనిపై నల్లకుంటలోనే కాకుండా కాచిగూడ పీఎస్ పరిధిలో రెండు కేసులు, తెలంగాణలోని పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే నల్లకుంట పీఎస్ పరిధిలో నమోదైన కేసు విషయంలో ఈ విచారణ కొనసాగుతున్నది.
వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా చారుకొండ మండలం, తూర్పు తండా, శేరిఆపారెడ్డిపల్లికి చెందిన కొర రమేష్ నిరుద్యోగి. 2017లో తన స్నేహితుల ద్వారా నల్లకుంటలోని ముద్ర అగ్రికల్చరల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీలెవెల్ కో-ఆపరేటివ్ సొసైటి లిమిటెడ్ లో ఉద్యోగాలు ఉన్నాయని తెలిసి సొసైటీ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడుని కలిశాడు. ఉద్యోగం కావాలంటే ముందుగా లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పాడు.
తన దగ్గర అంత మొత్తం డబ్బులు లేవని చెప్పి రూ.90వేలను ఇచ్చాడు. 2017 జూన్లో రంగారెడ్డి జిల్లా కందుకూరులో గల సొసైటీ బ్రాంచిలో క్యాషియర్గా రమేష్కు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. రెండు సంవత్సరాల్లో తమ సొసైటీ ముద్ర సొసైటీ బ్యాంకుగా మారుతుందని చైర్మన్ రామదాసప్ప నాయుడు అతనికి చెప్పాడు. అప్పుడు నెలకు రూ.20వేల జీతం ఇస్తానని చెప్పాడు. మూడు నెలల పాటు రూ.4వేలు, తరువాత రూ.8వేలు ఇచ్చాడు.
తర్వాత ఎలాంటి కారణం లేకుండా ఇచ్చే జీతంలో కోత విధించాడు. అదే విధంగా రెండు సంవత్సరాల్లో బ్యాంకుగా మారు తుందని చెబుతూ రైతుల నుంచి డిపాజిట్లు సేకరించాలని రమేష్కు టార్గెట్ పెట్టాడు. ఆ టార్గెట్ చేరకపోతే జీతంలో కట్ చేయడంతో పాటు మానసికంగా వేధించేవాడు. ‘ప్రధానమంత్రి ‘ముద్ర యోజన బ్యాంకు’ అని రైతులను నమ్మించి రమేష్ను రైతుల నుంచి డిపాజిట్లు చేయమనేవాడని, ‘కేసీఆర్ సహకార రుణ భవనం’ గా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించి ముద్ర సొసైటీని ప్రభుత్వ సంస్థగా నమ్మించి రైతులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడు.
అయితే రమేష్కు జీతం సరిపోకపోవడంతో 31జనవరి 2020న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తాను ఇచ్చిన రూ.90వేల డిపాజిట్ , ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని చైర్మన్ రామదాసప్ప నాయుడుని కోరగా, రమేష్పై క్రిమినల్ కేసులు పెడతానంటూ భయభ్రాంతులకు గురి చేశాడు. ఇలా చాలా మందికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నాడని రమేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
‘మార్గదర్శి’ అనే పత్రికలో అతనిపై మావోయిస్టులు, నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని ఆర్టికల్ ప్రచురిస్తూ భయపెడు తున్నాడని చెప్పారు. రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంస్థ లో పనిచేసే ఉద్యోగులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వాలని, సంస్థ పై కేసులు నమోదు చేసి కేసులు పెట్టాలని కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. హెచ్ఆర్సీని కూడా సంప్రదించారు.
ఈ నేపథ్యంలో నాంపల్లిలోని నాలుగో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన సెర్చ్ వారెంట్ మేరకు నల్లకుంట పోలీసులు సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించి అన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్ రెవెన్యూ సిబ్బంది సమక్షంలో కార్యాలయాన్ని సీజ్ చేశారు.