భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. సీధి జిల్లాలోని హత్వా అటవీ ప్రాంతంలో 15 ఏండ్ల బాలికపై నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక జిల్లా దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. ఈనెల 11న బాలికను రెవా జిల్లాలోని ఆమె అత్త ఇంటి నుంచి అపహరించారు.
తనపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు తనను దవాఖానలో చేర్చేముందు తనతో బలవంతంగా విషం తాగించాడని బాలిక తన స్టేట్మెంట్లో వెల్లడించింది. బాధిత బాలిక మేనత్త పిర్యాదు ఆధారంగా ఈనెల 11న రెవా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ నెంబర్లేని జీపులో ఇద్దరు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి తన మేనకోడలిని కిడ్నాప్ చేశారని మేనత్త ఫిర్యాదు చేసింది.
పోలీసుల దర్యాప్తులో భాగంగా ఈనెల 13 అర్ధరాత్రి జిల్లా ఆస్పత్రి గేటు వద్ద అనిల్ తివారీ అనే వ్యక్తి బాలికను దింపివెళ్లినట్టు గుర్తించారు. అయితే బాలిక తన స్టేట్మెంట్లో హత్వా గ్రామానికి చెందిన జీవేంద్ర సింగ్, అభ్యరాజ్ యాదవ్ తనను కిడ్నాప్ చేశారని, జీవేంద్ర సింగ్ రెండు రోజుల పాటు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు వేగవంతం చేశారు.