లక్నో: పొరుగున ఉండే ఇద్దరి పిల్లల ఫైట్లో వారి పెద్దల జోక్యంతో వివాదం మరింత ముదిరింది. ఈ కోట్లాటలో 12 ఏండ్ల బాలుడి నాలుకను పొరుగింటి వ్యక్తి కోసివేయగా, మరో పొరుగింటి వ్యక్తి దాడిలో మరో బాలుడి తలకు దెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహెర్ ఖుర్జా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పొరుగున ఉండే స్నేహితులైన ఇద్దరు పిల్లలు పోట్లాడుకున్నారు. గమనించిన ఇరువురి కుటుంబాల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరిపై మరొకరు భౌతికంగా దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక బాలుడి నాలుకను పొరిగింటి వ్యక్తి కత్తిరించాడు. మరో వ్యక్తి అతడి కుమారుడిని నెట్టివేయడంతో మరో బాలుడి తలకు గాయమైంది.
కాగా, బయట ఆడుకుంటున్న తమ కుమారుడ్ని పొరుగింటి వారు కొట్టారని నాలుక తెగిన బాలుడి తండ్రి ఆరోపించాడు. ఈ ఘర్షణపై ఇరు కుటుంబాల ఫిర్యాదుతో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకర్ని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నాలుక తెగిన బాలుడు చికిత్స పొందుతుండగా, తలకు గాయమైన బాలుడ్ని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.