లక్నో: మైనర్ బాలికైన (15)సవతి కూతురిపై కన్నేసి అదును చూసి ఆమెను కిడ్నాప్ చేసి ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడికి యూపీలోని మధుర కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఇది తన తొలి నేరం కావడంతో శిక్షను తగ్గించాలన్న నిందితుడిఅభ్యర్ధనను ప్రత్యేక పోక్సో కోర్టు తోసిపుచ్చింది. బాధితురాలు కుటుంబ సభ్యురాలు కావడం, ఆమె వయసు 16 ఏండ్లలోపు ఉండటంతో ఇది తీవ్రాతితీవ్రమైన నేరమని అదనపు జిల్లా ప్రభుత్వ కౌన్సెల్ సుభాష్ చతుర్వేది పేర్కొన్నారు. మైనర్ బాలికైన సవతి కూతురిపై లైంగిక దాడి అమానుషమని వాదనలు వినిపించారు.
నిందితుడికి కోర్టు యావజ్జీవ ఖైదు విధించడంతో పాటు రూ 2 లక్షల జరిమానా విధించింది. నిందితుడు ఆ మొత్తం చెల్లించలేని పక్షంలో ప్రభుత్వమే జరిమానా చెల్లించాలని పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమర్ సింగ్ ఆదేశించారు. బాలిక తల్లి(48) మొదటి భర్త మరణించడంతో 2013లో మరో వ్యక్తి (38)ని ఆమె పెండ్లి చేసుకుంది. అదే ఏడాది ఫిబ్రవరి 10న ఆమె బంధువుల ఇంటికి వెళ్లగా అదును చూసి అప్పటికి 15 సంవత్సరాల వయసున్న సవతి కూతురిని తీసుకుని నిందితుడు ఉడాయించాడు.
తొలుత ఆమెను అలీగఢ్కు తీసుకువెళ్లిన నిందితుడు ఆపై మహారాష్ట్రలోని లాతూర్కు తీసుకువెళ్లాడు. బాలిక కనిపించకపోవడంతో ఫిబ్రవరి 15న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన నెలరోజుల తర్వాత బాలికను లాతూర్ నుంచి పోలీసులు కాపాడారు. ఆపై బాలిక స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.