లక్నో: ఓ వ్యక్తి క్షణికావేశం మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. అభం శుభం తెలియని ఇద్దరు పసిబిడ్డలను పొట్టన పెట్టుకుంది. భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి క్షణాకావేశానికి లోనై భార్యను, పసివాళ్లయిన ఇద్దరు బిడ్డలను హత్యచేశాడు. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా ఖర్గుపూర్ ఏరియాలోని డియోరియా గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. డియోరియా గ్రామానికి చెందిన ఓం ప్రకాష్, కౌశల్యాదేవి (26) ఇద్దరూ భార్యాభర్తలు. వారికి నాలుగేండ్ల ఝాన్వి, ఏడాది వయసున్న గ్యాన్వి బిడ్డలు. ఢిల్లీలోని ఆజాద్పూర్ మార్కెట్లో పనిచేసే ఓం ప్రకాష్ అలియాస్ గుడ్డు తివారీ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం ఇంటికి వచ్చి గురువారం భార్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో భార్యను, ఇద్దరు బిడ్డలను హత్యచేశాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.