ముంబై, మే 25: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను దేశ జీడీపీ అంచనాల్ని తగ్గించింది బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్. ఊహించనివిధంగా కొవిడ్-19 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత వృద్ధిరేటును ఈసారి 9.2 శాతానికే పరిమితం చేస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. గత అంచనా కంటే ఇది 0.80 శాతం తక్కువ. కాగా, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో మందగమనం, ఆయా రాష్ర్టాల్లో మళ్లీ లాక్డౌన్లు అమల్లోకి రావడం కూడా వృద్ధి అంచనాల కోతకు కారణమేనని బార్క్లేస్ భారతీయ ప్రధాన ఆర్థికవేత్త రాహుల్ బజోరియా అన్నారు.
క్యూ4లో 1.3%
ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 1.3 శాతంగా నమోదు కావచ్చని ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక ‘ఎకోరాప్’ అంచనా వేసింది. ఈ క్రమంలోనే మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు మైనస్ 7.3 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నది. ఈ నెల 31న గత ఆర్థిక సంవత్సరానికిగాను దేశ జీడీపీ గణాంకాల్ని కేంద్రం విడుదల చేయనున్నది.