పట్నా : బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా నిర్భయ తరహా ఘటన బయటపడింది. కదులుతున్న బస్లో మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం బిహార్లోని బెటియా ప్రాంతంలో కలకలం రేపింది. బస్లో స్ప్రహ కోల్పోయిన స్ధితిలో బాలిక కనిపించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
పట్నా వెళ్లేందుకు తాను బస్ ఎక్కగా ముగ్గురు వ్యక్తులు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక వెల్లడించింది. డ్రైవర్, కండక్టర్, బస్లో ఉన్న మరో వ్యక్తి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొంది. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా బస్ను సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్, కండర్టర్ను అదుపులోకి తీసుకున్నారు.
వెస్ట్ చంపరన్ జిల్లాలోని బెటియాలో ముగ్గురు వ్యక్తులు మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టారని, బాలిక బస్లో అచేతన స్ధితిలో కనిపించిందని బెటియా ఎస్ఐ ముకుల్ పాండే తెలిపారు. ముగ్గురు నిందితులు బస్ డోర్లు మూసివేసి లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. బాలికను కాపాడిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని ఎస్ఐ పాండే పేర్కొన్నారు.