సిమ్లా: ఒక బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మరణించగా అందులోని 34 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (హెచ్ఆర్టీసీ) బస్సు మనాలి నుంచి సిమ్లా వెళ్తోంది. చండీగఢ్-మనాలి జాతీయ రహదారి 3లోని మండి వద్ద ఘాట్ మలుపులో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు బలంగా కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు.
కాగా, హిమాచల్ప్రదేశ్ ఆర్టీసీ బస్సులోని 34 మంది ప్రయాణిలు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు మండి ఎస్పీ షాలిని అగ్నిహోత్రి తెలిపారు. ప్రయాణికులతో బాగా రద్దీగా ఉండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని చెప్పారు. దీంతో ఎదురుగా ఉన్న కొండను అది ఢీకొట్టిందని అన్నారు. మరోవైపు ఈ ప్రమాదం నుంచి బయటపడిన కొందరు ప్రయాణికులు ఇతర వాహనాల్లో తమ గమ్య స్థానాలకు చేరారు.