ముంబై: పండ్లు అమ్మే ఒక వ్యక్తి డాక్టర్ అవతారమెత్తాడు. కరోనా రోగులకు చికిత్స కూడా చేస్తున్నాడు. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ ఘటన జరిగింది. కామ్తి ప్రాంతానికి చెందిన చందన్ నరేష్ చౌదరి పండ్లు, ఐస్క్రీమ్ అమ్మేవాడు. అనంతరం ఎలక్ట్రీషియన్గా అతడు పని చేశాడు. అలాగే చౌదరి గత ఐదేళ్లుగా ఓం నారాయణ మల్టీపర్పస్ సొసైటీ అనే పేరుతో ఛారిటబుల్ డిస్పెన్సరీని నడుపుతున్నాడు, రోగులకు ఆయుర్వేద, ప్రకృతి చికిత్స అందిస్తున్నాడు.
మరోవైపు దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని అవకాశంగా చౌదరి మలుచుకున్నాడు. డాక్టర్గా అవతారమెత్తి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాడు. కాగా, అతడు నకిలీ డాక్టర్ అన్న సంగతిని గ్రహించిన కొందరు రోగులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో చౌదరి డిస్పెన్సరీపై రైడ్ చేసిన పోలీసులు ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజెక్షన్లు, ఇతర వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ అర్హత లేకుండా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న చందన్ నరేష్ చౌదరిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.