అహ్మదాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒక పోలీస్ మరణించాడు. అయితే ఆరు నెలల తర్వాత అతడిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల చనిపోయినట్లు ఆరోపించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధోల్కాలోని సోనార్కుయ్ గ్రామంలో నివాసం ఉంటున్న 35 ఏళ్ల యోగేష్ సొనారా, వేజల్పూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 23న అర్ధ రాత్రి వేళ బైక్పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. అయితే మకర్బాలోని నయారా పెట్రోల్ పంప్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ టైర్ జారడంతో రోడ్డుపై పడ్డాడు.
కాగా, జనం గుమిగూడి ఉండటాన్ని గమనించిన హోంగార్డ్ అశ్విన్ గోహిల్, ప్రమాద స్థలానికి వెళ్లాడు. బైక్ నుంచి పడి రోడ్డుపై కూర్చొన్న కానిస్టేబుల్ యోగేష్ వద్దకు వెళ్లి ఏం జరిగిందని అడిగాడు. బైక్ టైర్ స్కిడ్ కావడంతో రోడ్డుపై పడినట్లు చెప్పాడు. చాల తల నొప్పిగా ఉందన్నాడు. దీంతో యోగేష్ను ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు. అయితే చికిత్స పొందుతూ జనవరి 29న అతడు మరణించాడు.
మరోవైపు ఈ సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత చనిపోయిన పోలీస్ కానిస్టేబుల్ యోగేష్పై కేసు నమోదైంది. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అతడు చనిపోయినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మకర్బా డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదైందని యోగేష్ తండ్రి చిమన్ ఆరోపించారు. కుమారుడి ఆకస్మిక మరణంతో తమ కుటుంబం తల్లడిల్లిపోయిందని, అతడికి ఏం జరిగింది, ఎందు వల్ల చనిపోయాడు అన్నది కూడా తమకు తెలియదన్నారు. తమ కుటుంబానికి సహకారం కోసం వేజల్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు రావడంతో ఇటీవల అక్కడికి వెళ్లినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా చనిపోయిన తన కుమారుడిపై కేసు నమోదైనట్లుగా తనకు తెలిసిందన్నారు.