మెహిదీపట్నం : ఓ అపార్టుమెంట్ భవనంలోని ఐదో అంతస్తు బాల్కనీలో ఆడుకుంటూ ఓ సంవత్సరం వయస్సు ఉన్న బాలిక జారిపడి దుర్మరణం చెందిన విషాదకర సంఘటన హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…..
హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్సాగర్ ప్రాంతంలో క్రీసెంట్ స్కూల్ సమీపంలోని ఓ అపార్టుమెంట్ ఐదో అంతస్తులో శివ(35), అనిత(32) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు. వీరి రెండో పాప సంవత్సరం వయస్సు ఉన్న అక్షర మధ్యాహ్నం బాల్కనీలో అడుకుంటూ జారికిందపడి తీవ్రగాయాలకు గురైంది.
బాలికను చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి బాలిక మృతి చెందినట్లు చెప్పారు. బాలిక మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసుదర్యాప్తులో ఉంది.