లక్నో : కళాశాలకు సమయానికి రావడం లేదని ఫిర్యాదు చేసినందుకు ఓ రిటైర్డ్ టీచర్ను మరో ముగ్గురు టీచర్లు కలిసి చితకబాదారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని చమన్ గంజ్ ఏరియాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చమన్ గంజ్ ఏరియాకు చెందిన అఫ్జల్ అహ్మద్ హలీం అనే వ్యక్తి కొన్నేండ్ల క్రితం టీచర్గా పదవి విరమణ పొందాడు. అయితే అఫ్జల్ రిటైర్ అయినప్పటికీ అతని సేవలను వినియోగించుకోవాలని కాలేజీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలో కాలేజీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా హలీంను మేనేజ్మెంట్ నియమించింది. అయితే ఓ ముగ్గురు టీచర్లు కాలేజీకి సరైన సమయానికి రావడం లేదని, క్లాసులు తీసుకోవడం లేదని హలీం మేనేజ్మెంట్కు చెప్పాడు.
తమపై ఫిర్యాదు చేసిన హలీంపై ముగ్గురు టీచర్లు మహ్మద్ సజిద్, మసూరుర్ అహ్మద్, సయీద్ మాజ్ హుస్సేన్ కక్ష పెంచుకున్నారు. డిసెంబర్ 10వ తేదీన హలీంపై ఆ ముగ్గురు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఒక నిమిషం పాటు హలీంపై పంచుల వర్షం కురిపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మేనేజ్మెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న టీచర్ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రిటైర్డ్ టీచర్పై దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.