ముహూర్తం ఖరారైంది. వంట ఎవరితో చేయిద్దామన్న చర్చ. ‘ఎవరైతే ఏంది? మంచిగ చేస్తేచాలు’ అన్నారొకరు. ‘ఇంత ఖర్చు పెడుతున్నం.. ఎవరో ఎందుకు? మదనాపురం వంటగాళ్లతోనే చేయిద్దాం’ అనేది మెజారిటీ అభిప్రాయం. ఫంక్షన్ సక్సెస్. వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనాలగురించే చెప్పుకొంటున్నారు. అంతగా ఏముంది ఆ వంటలో? అసలీ మదనాపురం నలభీముల కథేంటి? నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉంది మదనాపూర్ అనే ఊరు. మదనాపురం అనీ పిలుస్తారు. ఏ ఊర్లో అయినా ప్రధాన వృత్తి అంటే వ్యవసాయం అనే చెప్తాం కదా? కానీ మదనాపురం గ్రామస్తుల ప్రధాన వృత్తి మాత్రం వంటే. పదిహేనేండ్ల వయసున్న పిల్లాడెవరూ ఈ ఊర్లో ఖాళీగా ఉండరు. హైదరాబాద్లో ఏదో ఒక శుభకార్యంలో వంటలు చేస్తూ కనిపిస్తారు. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు వంటగాళ్లు ఉంటారు.
తెలంగాణ దావత్
‘తింటే మదనాపురం వంటగాళ్ల చేతివంటే తినాలి’ అనేంత పేరున్నది ఆ ఊరి వంటగాళ్లకు. దక్షిణ భారత వంటకాల్లో వీళ్లు ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా తెలంగాణ వంటకాలైన దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తలకాయ కూర, నాటుకోడి చికెన్, బోటీ, పచ్చి పులుసు, పాయ వంటివి అద్భుతంగా చేస్తారు. మసాలాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొబ్బరి వంటివి జోడించి పక్కా తెలంగాణ దావత్ సిద్ధం చేయడంలో వీళ్లను మించినవారే లేరని చెప్తుంటారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా మదనాపూర్ బ్యాచే కనిపిస్తుంది.
క్యాంప్ మైబు
మదనాపురంలో రెండువేలకు పైగా జనాభా ఉంటుంది. వీరిలో పిల్లలనూ, ముసలివాళ్లనూ వదిలేస్తే పదిహేనేండ్లు వచ్చిన వారి నుంచి అరవై నిండినవారి దాకా వంట పనిలో ఉన్నారు. 1984లో మొదటిసారి ఈ వృత్తిలోకి వెళ్లిన వ్యక్తి పేరు ‘మైబు’. పేదరికం వల్ల చదువుకు దూరమయ్యాడు మైబు. బతకాలంటే ఏదో ఒక పని చేయాలి కదా? అలా, పోలెపల్లికి చెందిన శీలం గోవిందరెడ్డి ఇంట్లో పనికి కుదిరాడు. గోవిందరెడ్డి కుటుంబం హైదరాబాద్లోని ఇసామియా బజార్కు మకాం మార్చింది. వారితో పాటు మైబు కూడా వచ్చాడు. వాళ్లింట్లోనే ఉంటూ వంట పనుల్లో సహాయం చేస్తుండేవాడు. మెల్లగా వంట మీద ఆసక్తి కలిగింది అతడికి. ఆ రోజుల్లో హైదరాబాద్లో ‘లక్ష్మీ ఉస్తాద్’ పేరుమోసిన షెఫ్. ఆయన దగ్గర వందలాది మంది వంట నేర్చుకున్నారు. గోపాల్ అనే వ్యక్తి ద్వారా లక్ష్మీ ఉస్తాద్ దగ్గర పనికి కుదిరాడు మైబు. కొద్దిరోజుల్లోనే తీరొక్క వంటల్ల్లో ప్రావీణ్యం పొందాడు. మూడు నాలుగేండ్లు అక్కడ పనిచేసిన తర్వాత, తానే హైదరాబాద్లో ‘ఆర్ఎస్ క్యాటరింగ్’ ఏర్పాటు చేశాడు. మదనాపురం యువతకు అదొక ఉపాధి కేంద్రంగా మారింది. వంట నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచింది. 1984 నుంచి ఇప్పటివరకు వందలాది మందిని ‘వంట మాస్టర్లు’గా తయారుచేశారు మైబు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఎంతోమందికి ఆశ్రయం కల్పించి ఘుమఘుమల్లో ఓనమాలు నేర్పించారు. విద్యార్థులకు పార్ట్టైమ్ ఉపాధిని కల్పించారు. అలా సుమారు 150 మందికిపైగా చీఫ్ షెఫ్లను తయారుచేశారు. వారంతా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. బైరామల్గూడ దగ్గర ఆయన క్యాటరింగ్ కేంద్రం ఉంది. వంటనే కెరీర్గా ఎంచుకొని, ఎంతోమందికి బతుకు దారిని చూపించిన మైబు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఒకమ్మాయి సివిల్ ఇంజినీరింగ్. ఇంకో అమ్మాయి కెనడాలో ఎమ్మెస్ చేస్తున్నది.
సెలబ్రిటీ షెఫ్
‘మైబు’ క్యాంప్ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన వంటగాడు శ్రీనివాస్. ఇతడు ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద కార్యక్రమాల్లో సేవలందించాడు. బండారు దత్తాత్రేయ ఇంట్లో ప్రతీ కార్యక్రమానికి ఇతడే పాక నిపుణుడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఫుడ్ ఫెస్టివల్స్కు, రాజకీయ నాయకుల ఇండ్లలో శుభకార్యాలకు తన చేతి వంట అందించి శభాష్ అనిపించుకున్నాడు. ఐటీఐ చదివిన శ్రీనివాస్.. ‘మైబు’ను చూసి , తానూ వంట మాస్టర్ కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ‘అదేం లక్ష్యంరా బాబూ? అదేమన్నా డాక్టర్ ఉద్యోగమా? ఇంజినీర్ ఉద్యోగమా’ అని అన్నవాళ్లు చాలామందే ఉన్నారు. అయినా శ్రీనివాస్ పట్టించుకోకుండా మైబు దగ్గర చేరాడు. ప్రాక్టికల్ అనుభవానికి, అకడమిక్ అనుభవం తోడైతే బాగుంటుందని హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. తనకిప్పుడు, ఈ వృత్తిలో 18 సంవత్సరాల అనుభవం ఉంది. సౌత్ – నార్త్ రుచులను అద్భుతంగా వండి వార్చడంలో శ్రీను ఆరితేరిపోయాడు.
నవతరం నలభీములు
శ్రీనివాస్, వెంకటేశ్, అక్రం వంటి వందలాది మంది ఇదే బాట పట్టారు. మహేశ్దీ ఇదే ఊరు. డిగ్రీ చదువుతున్నాడు. ఏ ఒక్కరోజు సెలవు దొరికినా వంటకు వెళ్తాడు. అలాగే విష్ణు. తను ఎంబీఏ చేశాడు. ఖాళీగా ఉండటం ఎందుకని క్యాటరింగ్ నేర్చుకున్నాడు. వీళ్లే కాదు.. మదనాపురంలోని ప్రతి ఇంటికీ ఒక షెఫ్ ఉన్నాడు. వీరికి వాట్సప్ గ్రూపులు ఉంటాయి. ఎవరికి ఏ ఆర్డర్ వచ్చినా చర్చించుకుంటారు. విద్యార్థులైతే చిన్న చిన్న ఫంక్షన్లకు చేసిపెట్టి పాకెట్ మనీ సమకూర్చుకుంటున్నారు. ఇలా హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఫంక్షన్లలో కచ్చితంగా మదనాపురం నలభీముల హస్తం ఉండితీరుతుంది.
సంతృప్తిగా ఉంది: మైబు
ఉపాధి కోసం వంట నేర్చుకొన్న నేను వందలాది మందికి పని నేర్పించాను. చాలా గర్వంగా ఉంది. అలా, లక్షలాది మంది నా చేతి భోజనం తింటున్నారు. వంట నేర్పిన నేను హైదరాబాద్లోనే ఉన్నాను కానీ, నేర్చుకున్నవాళ్లు దేశవిదేశాల్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ సంతృప్తితోనే కడుపునిండిపోతుంది.
అదృష్టంగా భావిస్తున్నా: శ్రీనివాస్
మైబు బాబాయ్ని చూసి వంట చేయాలనే ఆసక్తి కలిగింది. ఇద్దరం ముగ్గురం ఉండే ఇంట్లో వంట బాగుంది అని మెచ్చుకుంటేనే అంత ఖుషీ అవుతాం. అలాంటిది వందలాది మంది తినే ఫంక్షన్లకు వంట చేయడం, వారిచే శభాష్ అనిపించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది మదనాపురం గొప్పతనమే అనుకుంటున్నా.