నరేష్ అగస్త్య, రియా సుమన్, ప్రియాంక, హర్ష, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మెన్ టూ’. ఈ చిత్రాన్ని లాంటెన్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మౌర్య సిద్ధవరం నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకుడు. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్లో హీరో శర్వానంద్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ…‘మౌర్య నాకు మంచి మిత్రుడు. నాతో కలిసి ‘రణరంగం’ సినిమాలో నటించాడు. అతను ఈ సినిమా గురించి చెప్పినప్పుడు ప్రొడక్షన్ ఎందుకు అన్నాను.
నేనూ గతంలో ఇలాగే నిర్మాతగా చేతులు కాల్చుకున్నాను. కానీ సినిమా మీద ఇష్టంతో వెనకడుగు వేయకుండా పూర్తి చేశాడు’ అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ జి రెడ్డి మాట్లాడుతూ…‘ఈ కథతో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏదో కాంట్రవర్సీ చేయాలని చూస్తున్నాడు అనుకున్నారు. నా కథను, విజన్ను నమ్మిన ప్రొడ్యూసర్ మౌర్యకు థాంక్స్. ఈ మూవీ మంచి ఎంటర్టైనర్ అవుతుంది’ అని అన్నారు.
హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ…‘ఈ సినిమా పేరు మెన్టూ అని పెట్టాం కానీ అమ్మాయిలకే ఎక్కువ నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ చిత్రంలో హీరోగా అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అన్నారు. నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ..‘ఒక మంచి చిత్రాన్ని చేశామని నమ్ముతున్నాం. త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నాం. మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నాం’ అన్నారు.