Yandamuri Veerendranath | ‘భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్థలు సహజం. చిరంజీవికీ, నాకూ మధ్య తలెత్తింది అలాంటివే. నిజానికి అప్పుడేం జరిగిందో కూడా నాకు గుర్తులేదు’ అన్నారు ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఆయన చిరంజీవి జీవిత చరిత్ర రాయనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే మీడియా సాక్షిగా ప్రకటించారు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి యండమూరి ప్రస్తావించారు. ‘చిరంజీవితో నా బంధం ఈనాటిది కాదు. 42ఏళ్ల నాటిది. ఆయన ‘మంచుపల్లకి’ సినిమాకు మాటలు రాశాను.
అప్పటినుంచి ఇప్పటివరకూ మా స్నేహం కొనసాగుతూనే ఉంది. సుదీర్ఘమైన ప్రయాణాల్లో కుదుపులు సహజం. మా మధ్య ఏర్పడిన మనస్పర్థలు కూడా అలాంటివే. ప్రస్తుతమైతే మా మధ్య ఎలాంటి విభేదాలూ లేవు’ అని తెలిపారు యండమూరి. ఇంకా మాట్లాడుతూ ‘నాలుగేళ్ల తర్వాత చిరంజీవిని కలిశాను. ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాను. కానీ ఆయన ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు. నిజానికి చిరంజీవి జీవిత చరిత్ర రాయాలనే ఆలోచన నాకు చాలాకాలంగా ఉంది. ఆ వేదికపైనే నా అభిప్రాయాన్ని ఆయనకు చెప్పేశాను. ఆయన ఆశ్చర్యపోయారు. నావైపు సంభ్రమంగా చూస్తూ.. ‘నిజంగా రాస్తారా.. మీరు రాస్తే అంతకంటే కావాల్సిందేముంది.. ఇక్కడే ప్రకటించమంటారా?..’ అని అడిగేశారు. నేను సరే అనగానే.. ఆయన స్టేజ్పై ఆ విషయాన్ని ప్రకటించేశారు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు యండమూరి. చిరంజీవి జీవిత చరిత్ర రాయడం చిన్న విషయం కాదని, తపస్సుగా భావించి చేస్తే తప్ప సాధ్యంకాదని యండమూరి తెలిపారు.