విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజి గౌష్, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కథ వెనుక కథ’. ఈ చిత్రాన్ని దండమూడి బాక్సాఫీస్ పతాకంపై అవనీంద్ర కుమార్ నిర్మించారు. కృష్ణ చైతన్య దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశ్వంత్ దుడ్డుంపూడి మాట్లాడుతూ…‘మహిళలపై జరుగుతున్న అన్యాయాల నేపథ్యంతో సాగే చిత్రమిది.
ఇదొక ప్రయోగాత్మక సినిమా. కథే ప్రధానంగా ఉంటుంది. సునీల్, అలీ పాత్రలు ఆకట్టుకుంటాయి’ అన్నారు. నిర్మాత అవనీంద్ర కుమార్ మాట్లాడుతూ…‘మా సంస్థను స్థాపించినప్పుడు మంచి కథ దొరికితేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. మేము ఎదురుచూసిన అలాంటి కథతో తొలి చిత్రం నిర్మించాం. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేసే సినిమా అవుతుంది’ అన్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ…‘సమాజంలోని సమకాలీన పరిస్థితుల నేపథ్యంతో సాగే చిత్రమిది. సందేశం, వినోదం రెండూ ఉంటాయి. బలమైన కథతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు.