Manchu Vishnu | హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా ప్రేక్షకులను అలరిస్తుంటాడు మంచు విష్ణు. విష్ణు కెరీర్ మొదట్లో మంచి స్పీడ్లో ఉండేది. ఢీ, దూసుకెళ్తా, దేనికైనారెడి వంటి సినిమాలు విష్ణుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలకు భారీగా కలెక్షన్లు రాకపోయినా పెట్టిన బడ్జెట్ వచ్చేది. క్రమంగా ఈయన సినిమాలు ఓకే విధంగా ఉండటం.. కొత్తగా ప్రయత్నించకపోవడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేది. దాంతో థియేటర్లలో ఈయన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడంలేదు. ఈయన నటించిన గత ఐదారు సినిమాలు కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ఇదిలా ఉంటే ఈయన తాజాగా గాలి నాగేశ్వరరావు అనే డిఫరెంట్ క్యారెక్టర్తో సినిమాను చేయనున్నట్లు సోషల్ మీడీయాలో ప్రకటించాడు.
తన కెరీర్లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నారు విష్ణు అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంతో ఈషాన్ సూర్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. అవ ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని స్వర పరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని మేకర్స్ వెల్లడించారు. ఈయన గత చిత్రం మోసగాళ్లు పాన్ ఇండియా చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చూసింది.