Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు. ఈ విషయాన్ని బన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు దుబాయ్కు ధన్యవాదాలు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్స్. త్వరలో మళ్ళీ కలుద్దాం’ అంటూ పోస్టు పెట్టారు.
యూఏఈ గోల్డెన్ వీసా అందుకోవడం అంత సులభం కాదు. కేవలం కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇస్తుంటుంది. ఈ వీసాను మొదటిసారి బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ అందుకున్నాడు. ఆ తర్వాత సంజయ్ దత్, సానియా మీర్జా, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్లాల్, సోనూసూద్. మౌనీ రాయ్, బోనీ కపూర్, సంజయ్ కపూర్, వరుణ్ ధావన్, ఊర్వశి రౌతేలా, సునీల్ శెట్టి, నేహా కక్కర్, ఫరాఖాన్, రణవీర్ సింగ్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, విక్రమ్, త్రిష, కాజల్ అగర్వాల్, దుల్కర్ సల్మాన్, మీన, విజయ్ సేతుపతి తదితర నటులు ఇప్పటికే ఈ వీసాను పొందారు. తాజాగా ఈ జాబితాలోకి అల్లు అర్జున్ వచ్చి చేరారు. టాలీవుడ్లో గోల్డెన్ వీసా అందుకున్న తొలి హీరోగా రికార్డు సృష్టించారు.
విదేశీయులకు లాంగ్టర్మ్ రెసిడెన్సీకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం 2019లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే గోల్డెన్ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాను ఆటోమెటిక్గా పునరుద్ధరిస్తారు. ఈ గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులకు భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో యూఏఈ రాజధాని అబుదాబీ, దుబాయ్ తదితర సిటీల్లో పదేళ్ల వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా నివసించే వెసులుబాటు ఉంటుంది. గోల్డెన్ వీసా హోల్డర్లు వంద శాతం ఓనర్షిప్తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు. అయితే, ఈ వీసా అంత ఈజీగా రాదు. సైన్స్, సినిమా, క్రీడలు తదితర రంగాల్లో ప్రతిభావంతులైన, పేరు పొందిన వ్యక్తులకు మాత్రమే ఈ గోల్డెన్ వీసా ఇస్తారు.