విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 1’. ఈ చిత్రాన్ని చారిత్రక నేపథ్యంతో రెండు భాగాలుగా దర్శకుడు మణిరత్నం రూపొందించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. పాన్ ఇండియా మూవీగా ఈ నెల 30న విడుదల కాబోతున్నది. నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. శుక్రవారం ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ త్రిష మాట్లాడుతూ..‘చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది.
ఈ చిత్రంలో కుందవై పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు మణిరత్నంకు కృతజ్ఞతలు’ అన్నారు. ‘ఇలాంటి గొప్ప చిత్రాన్ని చేసినందుకు మా చిత్రబృందం అంతా గర్వపడుతున్నది. ఏ నగరానికి వెళ్లినా ప్రేక్షకులు మాపై ప్రేమ చూపిస్తున్నారు. మణిరత్నం తెరపై ఒక అందమైన పెయిటింగ్ లాంటి సినిమాను రూపొందించారు’ అని నాయిక ఐశ్వర్యరాయ్ అన్నారు. ‘కులమతాలకు అతీతంగా మనల్ని ఒక్కటి చేసేది సినిమా. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు సినిమా గొప్పదనం ఏంటో మరోసారి గుర్తొచ్చింది. ఇందులో ఒక పాత్ర నాకు దక్కడం ఆదృష్టంగా భావిస్తున్నా’ అని హీరో కార్తి అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘ఒక్క హీరోతో సినిమా చేయడమే కష్టమైతే ఈ చిత్రంతో ఇంతమంది స్టార్స్తో సినిమా రూపొందించడం మణిరత్నంకే సాధ్యమైంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఒక గొప్ప చిత్రాన్ని చూపించబోతున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఇది అద్భుతాన్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నాను’అన్నారు.