ప్రతీ ఏటా కొత్త దర్శకులు పుట్టుకొస్తూనే ఉంటారు. అందులో కొందరు సక్సెస్ సాధించి పల్లకి ఎక్కితే.. మరి కొందరు పరాజయాలు మూటగట్టుకుని పల్లకి ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని ఎదురు చూస్తుంటారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కొత్త దర్శకులు హవా బాగా నడిచింది. ఈ ఏడాది టాలీవుడ్లో సంతకం చేసిన దర్శకులు లిస్ట్ ఎంటో చూద్దాం. ఇండస్ట్రీలో గుర్తింపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సిద్దూ జొన్నలగడ్డకు ‘డీజే టిల్లు’తో మంచి డిమాండ్ తెచ్చిపెట్టాడు దర్శకుడు విమల్ కృష్ణ. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న దర్శక నిర్మాతలకు ఈ సినిమాతో విమల్ కృష్ణ మంచి ధైర్యాన్ని ఇచ్చాడు.
సీరియస్ పాత్రలతో మెప్పిస్తున్న విశ్వక్ను ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’లో అమాయకపు పాత్రలో చూపించి సక్సెస్ అయ్యాడు విద్యా సాగర్ చింతా. సమ్మర్లో రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మార్కెట్ పరంగా పట్టు కోల్పోయిన కళ్యాణ్రామ్ను ‘బింబిసార’ లాంటి ఫాంటిసీ డ్రామాతో చూపించి వశిష్ట సక్సెస్ సాధించాడు. ఏడేళ్లుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్రామ్కు మరో ఏడేళ్ల వరకు గుర్తుపెట్టుకునే సినిమా ఇచ్చాడు మల్లిడి వశిష్ట. హిట్టు మీద ఆశలు వదులకున్న శర్వానంద్కు ‘ఒకే ఒక జీవితం’తో మరిచిపోలేని హిట్టిచ్చాడు శ్రీకార్తిక్. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్కు అమ్మ సెంటిమెంట్ను జోడించి శ్రీకార్తిక్ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాడు.
కోలీవుడ్ నుండి వచ్చిన హరీ-హరీష్ సమంత ఇమేజ్ను క్యాష్ చేసుకుని ‘యశోద’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో భారీ విజయం అందుకున్నారు . గత నెలలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరుగులు పెట్టింది. కంటెంట్ ఉంటే స్టార్ కాస్ట్ అవసరం లేదని ‘మసూద’తో నిరూపించాడు సాయికిరణ్. ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజైన ఈ చిత్రం ఈ ఏడాది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తమిళంలో హిట్టయిన ‘ఓమై కడువలే’ని ‘ఓరి దేవుడా’గా రీమేక్ చేసి టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అశ్వత్ మారిముత్తు. బెల్లంకొండ గణేష్ను పరిచయం చేస్తూ ‘లక్ష్మణ్ కృష్ణ’ స్వాతిముత్యంతో మంచి ప్రశంసలు అందుకున్నాడు.
ఈ ఏడాది సక్సెస్ సాధించిన దర్శకులు ఎందరున్నారో.. ఫేయిల్యూర్ దర్శకులు అంతకంటే ఎక్కువే ఉన్నారు. రవితేజ వంటి మాస్ హీరోను సరిగ్గా యూజ్ చేసుకోలేక ‘రామారావు’తో సగం మార్కులతోనే సరిపెట్టుకున్నాడు శరత్ మండవ. లవర్ బాయ్ నితిన్ను ‘మాచర్ల’తో యాక్షన్ హీరోగా మెప్పించే ప్రయత్నంలో విఫలమైయ్యాడు రాజశేఖర్. వైష్ణవ్ తేజ్తో ‘రంగ రంగ వైభవంగా’ అంటూ పాత కథనే మిక్సీలో రుబ్బి రుచి లేని పచ్చడి చేశాడు గిరిశయ్య. ‘గని’తో వరుణ్ తేజ్ను బాక్సర్గా చూపించే ప్రయత్నంలో చేతులు కాల్చుకున్నాడు కిరణ్ కొర్రపాటి. ‘స్టాండ్ అప్ రాహుల్’తో స్టాండ్ అవుట్ అయిపోయాడు శాంటో. వీరితో పాటుగా గోపినాథ్ రెడ్డి ‘సమ్మతమే’తో, సతీష్ ‘త్రిపుర దొంగలున్నారు జాగ్రత్త’తో, బాలాజీ ‘సెబాస్టియన్’తో, ప్రదీప్ వర్మ ‘అల్లూరి’తో మొదటి అడుగులోనే జారీ పడ్డారు.