Supriya Yarlagadda | ‘మామయ్య అక్కినేని నాగార్జున కంటే బెటర్ ప్రొడ్యూసర్ ఎవరు లేరు. ఆయన ఎప్పుడో చేసినవి ఇప్పుడు చాలా మంది నిర్మాతలు చేస్తున్నారు. అందరూ కొత్తవాళ్లతో సీతారాముల కళ్యాణం, ఉయ్యాల జంపాల సినిమాలు నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు ఎప్పుడో శ్రీకారం చుట్టింది’ అన్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా అందరికి సుపరిచితురాలైన సుప్రియ, ఛాయ్బిస్కెట్ నిర్మాణ సంస్థతో కలిసి కన్నడంలో విడుదలైన ఓ చిత్రాన్ని ‘బాయ్స్ హాస్టల్’పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సుప్రియ యార్లగడ్డ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్ చూడగానే వినోదాత్మకంగా అనిపించింది.
ప్రపంచంలో కెల్లా మంచి ప్రేక్షకులు మన దగ్గర వున్నారు. మంచి కంటెంట్ ఇస్తే చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాని రీమేక్ చేయడం కష్టం. ఒరిజినల్గానే ఎంజాయ్ చేస్తే ఈ సినిమా బాగుంటుంది. అందుకే తెలుగులో డబ్ చేశాం. మామయ్య హీరో కావడం వల్లే అన్నపూర్ణ స్టూడియో నిలిచిందని భావిస్తాను. స్టూడియో ఇండస్ట్రీకి హబ్గా మారింది. ఇటీవల స్టూడియోకి వచ్చిన నాగార్జునకు పార్కింగ్ స్థలం దొరకలేదు. ఆయన తిడతారేమో అని భయపడ్డా. ఆయన చూసి ‘తాత వుంటే చాలా ఆనందపడే వారు కదా అన్నారు. దీనికి కారణం స్టూడియో ప్రారంభమైనప్పుడు తాత అమ్మమ్మ ఇక్కడ కూర్చుని.. ‘ఈ నెల కూడా ఎవరూ షూటింగ్కు రాలేదండి’ అని అమ్మమ్మ అనేవారు. ఇప్పుడి ఇంత పెద్దగా ఎదిగిందంటే ఇందులో తాత, నాగార్జున కృషి వుంది’ అన్నారు.