నటి ఊర్వశీ రౌటేలా, క్రికెటర్ రిషభ్ పంత్ మధ్య కొన్నాళ్లుగా సాగిన సోషల్ మీడియా వార్కు తెరపడింది. ఈ నాయిక గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో క్రికెటర్ రిషభ్ పంత్ తన కోసం గంటల తరబడి హోటల్ లాబీల్లో వేచి చూశాడని చెప్పడం వివాదం రేపింది. అతని పేరు చెప్పకుండా ఆర్పీ అని పిలుస్తూ ఊర్వశీ రౌటేలా ఆరోపణలు చేసింది. వీరి స్నేహం గురించి గతంలోనూ కొన్ని ప్రచారాలు జరిగాయి. మరోవైపు రిషభ్ పంత్ కూడా ఊర్వశీ వ్యాఖ్యలను ఖండించాడు.
తాజాగా ఈ వివాదంపై స్పందించింది ఊర్వశీ రౌటేలా. ఆమె మాట్లాడుతూ..‘నాకు డొంకతిరుగుడు వ్యవహారం తెలియదు. ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడతా. అతని విషయంలో నేను మాట్లాడింది తప్పే. అందుకు క్షమాపణలు చెబుతున్నా. ఈ మొత్తం వివాదంలో నేను చెప్పాలనుకునేది ఇంకేమీ లేదు’ అంది. ‘కాబిల్’, ‘పాగల్ పంటి’, ‘హేట్ స్టోరీ 4’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో నాయికగా గుర్తింపు తెచ్చుకుందీ తార. ప్రస్తుతం తెలుగులో ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాలో నటిస్తున్నది.