పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. చిత్ర నిర్మాణంతో పాటు ‘ఆదిపురుష్’ లాంటి ప్రతిష్టాత్మక సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారాయన. ఈ సంస్థలో ప్రస్తుతం పదిహేను సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నెల 16న ‘ఆదిపురుష్’ విడుదలవుతున్న సందర్భంగా చిత్ర నిర్మాణంలో తన అనుభవాలు తెలిపారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. ఆయన మాట్లాడుతూ…‘ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ చూసిన తర్వాత ఇది తప్పకుండా సంచలనం సృష్టిస్తుందని నమ్మాం. తెలుగులో మంచి ధరకు తీసుకుని విడుదల చేస్తున్నాం.
టికెట్ ధరల పెంపు గురించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాం. వారి నుంచి స్పందన సానుకూలంగా ఉంది. సింగిల్ స్క్రీన్స్లో 50 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. మేము 25 రూపాయలు పెంచాలని అనుకుంటున్నాం. మల్టీఫ్లెక్స్లో టికెట్ రేట్స్ మారవు. టీ సిరీస్ సంస్థతో భవిష్యత్లోనూ ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాను కూడా మేమే తెలుగులోకి తీసుకొస్తాం. ఫ్యాక్టరీ మోడల్లో సినిమాలు నిర్మిస్తున్నాం. అందులో జయాపజయాలు ఉంటాయి. పరాజయం వస్తే మళ్లీ అది పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం. అదృష్టవశాత్త్తు మా సంస్థకు విజయాల శాతమే ఎక్కువగా ఉంది.
మేము సొంతంగా చేసినా, మరో సంస్థతో కలిసి నిర్మించినా హిట్స్, ఫ్లాప్స్ వచ్చాయి. ఓటీటీ రైట్స్కు మంచి ఆదాయం వస్తున్నది. కేవలం థియేటర్స్ ఆదాయం మీద ఆధారపడితే నిర్మాతలు ముందుకు సాగలేరు. ఓటీటీ సపోర్ట్ వల్లే వచ్చే ఏడాదిన్నరలో దాదాపు 25 సినిమాలు నిర్మించబోతున్నాం. తక్కువ సమయంలో వంద చిత్రాలు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నాం. మా సంస్థలో ప్రస్తుతం 15 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వాటిలో 8 నుంచి 10 సినిమాలను కొత్త దర్శకులు తెరకెక్కిస్తున్నారు. మా సంస్థలో 25వ చిత్రంగా పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్లతో ‘బ్రో’ నిర్మిస్తున్నాం. 50వ సినిమా ప్రకటన త్వరలోనే ఉంటుంది.