‘హనుమంతుడి ఇతివృత్తంలోని ఓ కీలక సంఘటనను తీసుకొని కాల్పనిక అంశాలతో ఈ కథను సిద్ధం చేశాం. అంజనాద్రి అనే ఓ ద్వీపంలో ఈ కథ నడుస్తుంది’ అన్నారు ప్రశాంత్వర్మ. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘హను-మాన్’. నిరంజన్ రెడ్డి నిర్మాత. నేడు దర్శకుడు ప్రశాంత్వర్మ జన్మదినం. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి.
జూలై మొదటివారంలో విడుదల తేదీని ప్రకటిస్తాం. తొలుత ఈ చిత్రాన్ని తెలుగులోనే తీద్దామనుకున్నాం. టైటిల్, ఫస్ట్లుక్ విడుదల చేసిన తర్వాత హిందీతో పాటు మిగతా దక్షిణాది భాషల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభించింది. దాంతో పాన్ ఇండియా మూవీగా తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఈ సినిమాలో హనుమంతుడిగా తేజ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది. ఓ సామాన్యుడికి సూపర్పవర్స్ వస్తే అతను వాటితో దుష్టశిక్షణ ఎలా చేశాడన్నది ఆసక్తిని పంచుతుంది. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే ఓ ఫిక్షనల్ ప్రపంచాన్ని సృష్టించాం. హనుమంతుడిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.
ఆయన పేరుతో సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందుకే పాన్ ఇండియా మూవీగా తీసుకొస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో సూపర్హీరో కథలకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి సినిమాల్ని మనం ఎందుకు తీయకూడదనే ఆలోచన నుంచే ఈ సినిమాకు అంకురార్పణ జరిగింది. నా పుట్టినరోజున ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్ను ప్రకటించబోతున్నా. రాబోయే పదేళ్లలో ఎనిమిది సూపర్హీరో ఫిల్మ్స్ తీయాలనుకుంటున్నా. ప్రతిభావంతులైన టీమ్తో హాలీవుడ్ తరహాలో స్టూడియో నడపాలన్నది నా ఆలోచన’ అన్నారు.