నయనతార నటించిన తమిళ సినిమా ‘కనెక్ట్’ అదే పేరుతో తెలుగులోకి వస్తున్నది. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి దర్శకుడు అశ్విన్ శరవణన్ మాట్లాడుతూ..‘నయనతార నటనను ఇష్టపడతాను. ఆమెతో గతంలో ‘మాయా’ అనే చిత్రాన్ని రూపొందించాను.
ఈ సినిమా కథ విన్నాక నయనతార తనే నిర్మిస్తానంది. ప్రొడక్షన్లో రాజీ పడకుండా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో నిర్మించేందుకు ప్రయత్నించింది. ఇక నటిగానూ నయనతార ఆద్యంతం మెప్పిస్తుంది. ఇలాంటి కథల్లో నటీనటులు ఎంత బాగా నటిస్తే ప్రేక్షకులు అంతగా సినిమాకు కనెక్ట్ అవుతారు. ఆత్మ ఆవహించిన బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన సాహసమే ఈ సినిమా ఇతివృత్తం. లాక్డౌన్ నేపథ్యంగా సినిమా రూపొందించాం.
ఈ చిత్రానికి విరామం లేదు. గంటన్నర పాటు ఏక బిగిన సాగుతుంది. ఫాదర్ అగస్టీన్ పాత్రలో అనుపమ్ ఖేర్ పాత్ర ఆకట్టుకుంటుంది. హారర్ జానర్ సినిమాలు చేయడం నాకు ఇష్టం. మరిన్ని హారర్ చిత్రాలు తెరకెక్కించాల్సిన అవసరం ఉంది. ఇటీవల తెలుగులో వచ్చిన ‘మసూద’ మంచి విజయాన్ని అందుకుంది. ఇక్కడ హీరో నాని అంటే ఇష్టం. ఆయనతో ఓ సినిమా రూపొందించాలని ఉంది. తెలుగు, తమిళ పరిశ్రమలు కలిసి పనిచేస్తుండటం మంచి పరిణామం’ అని అన్నారు.