అందాల తార తమన్నా నటించిన కొత్త సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ హిట్ ఫిల్మ్ లవ్ మాక్టెయిల్కు రీమేక్గా దర్శకుడు నాగశేఖర్ రూపొందిస్తున్నారు. ఈ నెల 9న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో చిత్రంలో నటించిన అనుభవాలతో పాటు తన కెరీర్ విశేషాలు తెలిపింది తమన్నా.
ఆమె మాట్లాడుతూ…‘నాయికలు తమ కెరీర్ ప్రారంభంలోనే ప్రేమ కథా చిత్రాల్లో నటిస్తారు. పదిహేడేండ్ల కెరీర్ సాగించిన తర్వాత మళ్లీ ఒక క్యూట్ లవ్ స్టోరి చేయాలనిపించింది. అందుకే ఈ సినిమాలో నటించాను. చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడాలు నేను పెట్టుకోను. ఏదైనా మంచి సినిమా కోసం అందరం పనిచేస్తాం. పెద్ద హీరోలు ఆటిట్యూడ్ చూపిస్తారని అనుకుంటాం గానీ దగ్గరగా చూస్తే వాళ్లు ఎక్కువ బాధ్యత తీసుకుంటారు.కథలో నేను ఓ ప్రత్యేకతను తీసుకొస్తా అని దర్శకులు నమ్ముతారు కాబట్టే నాకు అవకాశాలు ఇస్తుంటారు. చిరంజీవి గారి ‘సైరా నరసింహారెడ్డి’లో నేను చిన్న నిడివి పాత్రలోనే నటించాను. కానీ ఈ సినిమాలో నా పాత్ర కీలకంగా ఉంటుంది.
ఓటీటీలు వచ్చాక ప్రేక్షకులు హీరో హీరోయిన్లను చూడటం లేదు, ఆ సినిమాలోని కంటెంట్ను మాత్రమే చూస్తున్నారు. డిజిటల్ మాధ్యమం వచ్చాక నాకు నటిగా మరో ఆప్షన్ దొరికిందని భావిస్తున్నా. నాతో పాటు కాజల్, అనుష్క, సమంత ఎక్కువ కాలం తెరపై జోరు చూపించాం. ఇప్పటికీ వారితో నాకు మంచి స్నేహం ఉంది. నాకు మీడియా సంస్థలు చాలా సంబంధాలు కుదిర్చాయి. ఒకసారి డాక్టర్తో, మరొకసారి వ్యాపారవేత్తతో పెండ్లి అంటూ నిర్ణయించేశారు. వివాహం చేసుకోమనే ఒత్తిడి, పోరు అందరి అమ్మాయిల ఇంటిలోలాగే నాకూ ఉంది. పెండ్లి టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటా. అది నా జీవితంలో కీలక నిర్ణయం కాబట్టి ఆలోచించి తీసుకోవాలి’ అని చెప్పింది.