కమల్ హాసన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. దాంతోపాటు అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు. నచ్చిన కథలు వచ్చినప్పుడు నటుడిగా సత్తా చూపించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో సరైన విజయం లేని కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడితో ‘భారతీయుడు 2’ సినిమాను ప్రకటించాడు. అయితే సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. మధ్యలో ఒక భారీ ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో తమిళనాడు హైకోర్టు కూడా ‘భారతీయుడు 2’ యూనిట్ పై సీరియస్ అయింది. దీనికి పూర్తి బాధ్యత మీరు తీసుకోవాలి అంటూ చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
దానికి ముందు కూడా కొన్ని సార్లు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఎలాగోలా అన్ని అవాంతరాలు దాటుకుని మళ్ళీ షూటింగ్ మొదలైంది అనుకుంటే కరోనా వైరస్ వచ్చింది. దాంతో ‘ఇండియన్ 2(భారతీయుడు 2)’ మరోసారి మూలన పడింది. కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఓవర్ బడ్జెట్ కారణంగా లైకా ప్రొడక్షన్స్ సినిమా నుంచి తప్పుకుంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. పైగా ఈ మధ్య రామ్ చరణ్ సినిమాకు శంకర్ కమిట్ అవ్వడంతో కమల్ హాసన్ సినిమా ఆగిపోయిందని అందరూ కన్ఫామ్ చేసుకున్నారు.
ఇలాంటి సమయంలో తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఇదే విషయం ఖరారు చేసింది. మంచు విష్ణు నటించిన ‘మోసగాళ్లు’ సినిమా ప్రమోషన్లో భాగంగా బయటికి వచ్చిన కాజల్.. ‘ఇండియన్ 2’ సినిమా ఆగిపోయింది అంటూ క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది అంటూ కన్ఫామ్ చేసింది కాజల్. దాంతో కమల్ హాసన్ అభిమానులకు షాక్ తప్పలేదు. ఈ సినిమా ప్రొడక్షన్ లోకి లైకా రాకముందు దిల్ రాజు నిర్మించాలనుకున్నాడు. కానీ బడ్జెట్ కారణంగా తప్పుకున్నాడు. అయితే అప్పుడు మిస్సయినా.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాను ఆయనే నిర్మిస్తున్నాడు.