సంజయ్దత్ నటించిన కల్ట్క్లాసిక్ ‘ఖల్ నాయక్’ చిత్రానికి ఇటీవలే సీక్వెల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ పేరుతో ఇది తెరకెక్కనుంది. ‘ఖల్ నాయక్’లోని ‘చోళీ కే పీచే క్యా హై’ పాట అప్పట్లో అత్యంత ప్రజాదరణ పొందింది. మాధురీ దీక్షిత్ నృత్యాలు యువతరాన్ని ఆకట్టుకున్నాయి. అదే సమయంలో ద్వందార్థాలతో కూడిన పాట ఇదనే విమర్శలు కూడా వచ్చాయి.
ఇదిలావుండగా.. తాజా సీక్వెల్లో ఈ పాటను రీమిక్స్ చేయబోతున్నారట. ఇందులో తమన్నా నర్తించనుందని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే తమన్నా పలు చిత్రాల్లో ఐటెంసాంగ్స్ చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ‘స్త్రీ-2’ చిత్రంలో తమన్నా చేసిన ‘ఆజ్ కి రాత్’ ప్రత్యేక గీతం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘ఖల్ నాయక్ రిటర్న్స్’లో ఆమె పేరునే పరిశీలిస్తున్నారని బాలీవుడ్ టాక్.