సినీరంగంలోని వివాదాలు, సమస్యలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటుంది పంజాబీ సుందరి తాప్సీ. ముఖ్యంగా మహిళాసాధికారత, పురుషాధిక్యత గురించి తన గళాన్ని వినిపిస్తుంటుంది. తాజా ఇంటర్వ్యూలో సినీరంగంలో పురుషాధిక్య భావజాలం గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘ఓ స్థాయి కలిగిన కథానాయికలు అగ్రహీరోల చిత్రాల్లో కేవలం అలంకారప్రాయంగా ఉండే పాత్రల్ని పోషించడానికి నిరాకరిస్తున్నారు. నాలుగు పాటలు, నాలుగు సన్నివేశాలకు పరిమితం కాకుండా తమ పాత్ర ప్రభావం బలంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఈ ధోరణి శుభపరిణామంగా భావిస్తున్నా. కథానాయికలందరూ ఇదే పట్టుదలతో ఉంటే రచయితలు, దర్శకులు వారి పాత్రలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ కథల్ని తయారుచేస్తారు. వాణిజ్య చిత్రాల్లో కూడా నాయికల్ని చిత్రించే ధోరణిలో మార్పు వస్తుంది. తమ పాత్రల విషయంలో కథానాయికలకు ప్రశ్నించే తత్వం ఉండాలి. అప్పుడే హీరోలతో సమానత్వాన్ని సాధించగలుగుతారు. ముందుతరాల నాయికలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది’ అని చెప్పింది. ప్రస్తుతం తాప్సీ తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిత్రంలో నటిస్తున్నది.