కెరీర్ ఆరంభం నుంచి కథాంశాల ఎంపికలో కొత్తదనం, పాత్రలపరంగా ప్రయోగాలతో తనకంటూ ప్రత్యేకపంథా సృష్టించుకున్నారు యువ హీరో సుధీర్బాబు. ఆయన నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. కరుణకుమార్ దర్శకుడు. నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం సుధీర్బాబు పాత్రికేయులతో ముచ్చటించారు.
నా ప్రతి సినిమాలో కథా, పాత్రలపరంగా కొత్తదనం ఉండేలా చూసుకుంటా. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా విషయంలో కూడా అదే పద్దతి పాటించా. పూర్తి గోదావరి జిల్లా గ్రామీణ నేపథ్యంలో చేసిన సినిమా ఇది. పల్లె వాతావరణాన్ని తెరపై పునఃసృష్టిస్తూ దర్శకుడు అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దాడు. ‘పలాస’ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసిన తర్వాత దర్శకుడు కరుణకుమార్కు ఫోన్ చేసి అభినందించా. ‘ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి..మనం సినిమా చేద్దాం’ అని అడిగాను.
సూరిబాబు కథ
చక్కటి కథాబలం, వాణిజ్య అంశాలు సమపాళ్లలో మేళవించిన సినిమా ఇది. సన్నివేశాలన్ని నాటకీయత లేకుండా చాలా సహజంగా అనిపిస్తాయి. కుల వివక్ష, గ్రామీణ రాజకీయాలు, ఆధిపత్యపోరాటం..ఇలా అన్ని అంశాల్ని స్పృశిస్తూ ఈ కథ సాగుతుంది. ఊరిలో ఎలక్ట్రీషియన్గా పనిచేసే సూరిబాబు అనే యువకుడి కథ ఇది. అతనికి శ్రీదేవి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వారిద్దరి ప్రేమ ప్రయాణంలోని సంఘర్షణ ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది.
కథల్లో కొత్తదనం ఉండాలి
నటుడిగా ప్రతి సినిమాకు నేను పరిణితి సాధిస్తూ ఓ మెట్టు ఎక్కుతున్నాననే భావన కలుగుతోంది. బాక్సాఫీస్ బిజినెస్ పరంగా కూడా నాకంటూ ఓ మార్కెట్ను, నిర్మాతల విశ్వాసాన్ని సంపాదిం చుకున్నా. అయితే స్టార్డమ్ కంటే నేను ఎంచుకుంటున్న కథల వల్ల పరిశ్రమలో ఎక్కువ కాలం కొనసాగే వీలుంటుందని భావిస్తున్నా. కథల్లో వైవిధ్యం వల్లే నా కెరీర్లో ఫెయిల్యూర్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి.
క్రీడానేపథ్యంలో పాన్ ఇండియా సినిమా
బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ జీవిత కథతో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా చేయబోతున్నా. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్మీదకు వెళ్తుంది. నేను ప్రస్తుతం నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ డబ్బుశైతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.