భక్తి, భావోద్వేగాల మేళవింపుగా రానున్న ఆధ్యాత్మిక చిత్రం ‘శివాలయం’. రంగస్థలం మహేశ్, కాంచన దీప్తిరెడ్డి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్రెడ్డి నంది స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రమేశ్ కెమెరా స్విఛాన్ చేయగా, ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు.
ప్రముఖ వ్యాపారవేత్త కళ్లెం నరసింహారెడ్డితోపాటు పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ఈశ్వరుని లీలలు, మహిమలను ఆవిష్కరించే సినిమా ఇది. ప్రేక్షకులకు భక్తిభావన కలిగించే కథ, కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ కథపై చాలా కసరత్తు చేశాను. ప్రీప్రొడక్షన్ పనులకు ఆరు నెలలు పట్టింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’ అని తెలిపారు.