సినిమా టీజర్, ట్రైలర్స్ను థియేటర్లలో స్క్రీనింగ్ చేయడం ఇప్పుడొక ట్రెండ్గా మారింది. తమ సినిమాను ఎంత భారీగా, క్వాలిటీగా రూపొందించామో ప్రేక్షకులకు వాస్తవిక అనుభూతి కలిగించేందుకు ఇలా పెద్ద తెరలపై ప్రదర్శిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, ఇటీవల ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాల ట్రైలర్ ఇలాగే థియేటర్స్లో స్క్రీనింగ్ చేశారు. తాజాగా మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా స్పెషల్ టీజర్ కూడా ఇలాగే థియేటర్స్లో స్క్రీనింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. ఈ నెల 31న స్వర్గీయ సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ టీజర్ రిలీజ్ చేయనున్నారనే విషయం ఇప్పటికే వెల్లడవగా…ఈ టీజర్ను రెండు తెలుగు రాష్ర్టాల్లోని థియేటర్స్లో ప్రదర్శించబోతున్నారనేది తాజా సమాచారం. మిర్చి యార్డ్ నేపథ్యంలో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.