Adivi Sesh | ‘ఈ ఏడాది నా సినిమాలేవీ విడుదల కాలేదనే బాధ నాకులేదు. పేస్ బౌలర్లందరికీ ఒకే స్పీడ్ ఉండదు. మనిషన్నాక ఎవరి స్పీడ్ వాళ్లకుంటుంది. ఈ ఏడాదంతా స్క్రిప్ట్ వర్క్కే సరిపోయింది. గత ఏడాది మేజర్, హిట్-2 సినిమాలు విడుదలై విజయం సాధించాయి. వచ్చే ఏడాది అలాగే రెండు విడుదలవుతాయి’ అని అడవిశేషు చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. ప్రస్తుతం చేస్తున్న ‘జీ2’ అయిదుదేశాల్లో జరిగే కథని, యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టే పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నామని, అలాగే శృతిహాసన్తో చేస్తున్న సినిమా కూడా హిందీ, తెలుగు భాషల్లో వేరువేరుగా షూట్ చేస్తున్నామని, నటీనటులను కూడా తెలుగు, హిందీ భాషల్లో పట్టున్నవాళ్లనే తీసుకుంటున్నామని అడివిశేషు చెప్పారు. ఇంకా చెబుతూ ‘నేను గుడ్ యాక్టర్, గ్రేట్ రైటర్, బ్యాచ్ డైరెక్టర్ అని ఫీలవుతా. దర్శకుడికి ఓర్పు అవసరం. అది నాకు లేదు.
అందుకే నేను యాక్టింగ్, రైటింగ్ ప్రిఫర్ చేస్తా. అదికూడా కేవలం నాకోసం. ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక, కేవలం నటుడిగానే మరో రెండు సినిమాలు చేయబోతున్నాను’ అని చెప్పారు అడివిశేషు. శృతిహాసన్తో చేసే సినిమా వెరీ ఇంటెన్స్ యాక్షన్ లవ్స్టోరీ అని, హైలీ ఎమోషనల్ న్యూజానర్ ఫిలిం అని, దర్శకుడు షానీల్ డియో అద్భుతమైన ప్రతిభావంతుడని, ‘క్షణం’ చేస్తున్న సమయంలో తను చేసిన షార్ట్ఫిలిం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంపికైందని తెలిసి షాక్ అయ్యానని, ఎలాగైనా అతడ్ని డైరెక్టర్గా పరిచయం చేయాలనే నా ఆకాంక్ష నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందని అడివి శేషు చెప్పారు.