బ్రహ్మానందం, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, స్వాతిరెడ్డి, రాహుల్విజయ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. హర్ష పులిపాక దర్శకుడు. బుధవారం హైదరాబాద్లో టీజర్ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ ‘నిర్మాతలతో ఉన్న స్నేహం వల్ల కథ వినకుండానే ఈ సినిమా చేశా. లేఖ అనే యువతిగా నా పాత్ర అభినయప్రధానంగా సాగుతుంది’ అని చెప్పింది. ‘అమ్యూజ్మెంట్ పార్క్ లాంటి సినిమా ఇది. ఇందులో ఊహించని ప్రయాణాలు, మలుపులు ఉంటాయి. భిన్న నేపథ్యాలు కలిగిన కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ఏం జరిగిందన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని దర్శకుడు చెప్పారు. ఐదు కథల సమాహారంగా రూపొందిన ఆంథాలజీ చిత్రమిదని, స్వాతితో కలిసి తాను నటించానని ఆదర్శ్ బాలకృష్ణ పేర్కొన్నారు. నటుడిగా తనకు మంచి పేరుతెచ్చిపెట్టే చిత్రమిదని రాహుల్ విజయ్ అన్నారు. స్నేహితులు, నటీనటుల సహకారంతో అనుకున్న సమయంలో ఈ సినిమాను పూర్తిచేశానని నిర్మాత తెలిపారు.