Shah Rukh Khan | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంజాబ్ అతాలకుతలం అయిన విషయం తెలిసిందే. భారీ వరదలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా.. వరదల తాకిడికి పలువురు చనిపోయారు. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తన వంతు సహాయం అందించారు. తన స్వచ్ఛంద సంస్థ ‘మీర్ ఫౌండేషన్’ ద్వారా వరద బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ ఛారిటీ సంస్థ అయిన మీర్ ఫౌండేషన్, పంజాబ్లోని స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి సహాయ కార్యక్రమాలను చేపట్టింది. అమృత్సర్, పాటియాలా, ఫాజిల్కా, ఫిరోజ్పూర్ వంటి వరద ప్రభావిత జిల్లాల్లోని 1500 కుటుంబాలకు పైగా సహాయ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో మందులు, ఆహార పదార్థాలు, దోమ తెరలు, టార్పాలిన్ షీట్లు, మడతపెట్టే పడకలు వంటి అత్యవసర వస్తువులను అందించారు. ఈ సహాయంతో బాధితుల తక్షణ ఆరోగ్య, భద్రత, మరియు ఆశ్రయం అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నారు.
మరోవైపు వరదలపై స్పందించిన షారుఖ్ ఖాన్ తన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఈ కష్టకాలంలో పంజాబ్ ప్రజలకు నా హృదయం అండగా ఉంటుంది. వారికి నా ప్రార్థనలతో పాటు ధైర్యాన్ని పంపుతున్నాను. పంజాబ్ స్ఫూర్తి ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. దేవుడు వారందరినీ ఆశీర్వదించుగాక అని ఆయన పేర్కొన్నారు.