Sequels Trend | ఒకప్పుడు సినిమా అంటే ఒక పార్ట్తో ముగిసిపోయే కథ. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా వినని “సీక్వెల్” అనే పదం ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యంత వినిపిస్తున్న మాటగా మారింది. ఒక హిట్ సినిమా వస్తే… దానికి రెండో భాగం, మూడో భాగం తీసే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. దర్శకులు, హీరోలు, నిర్మాతలు అందరూ ఇప్పుడు సీక్వెల్స్పైనే దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకుల్లోనూ అదే ఆసక్తి కనిపిస్తుండటంతో ఇది ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్గా మారింది. ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన క్రైమ్ థ్రిల్లర్గా ‘దృశ్యం’ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వెంకటేష్ నటించిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘దృశ్యం 3’ కోసం సిద్ధమవుతున్నారు. మలయాళ వెర్షన్ ఇప్పటికే పూర్తయి విడుదలకు రెడీగా ఉండగా, హిందీ వెర్షన్ షూటింగ్ దశలో ఉంది. రెండో భాగం ముగిసిన దగ్గర నుంచే మూడో భాగం ప్రారంభమవుతుందని సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది రెండు భారీ సీక్వెల్స్తో రానున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అవే ‘కల్కి 2’, ‘సలార్ 2’. ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ షూటింగ్స్లో బిజీగా ఉన్న ప్రభాస్… వాటి తర్వాత ‘కల్కి 2’ను మొదలు పెట్టి, ఆపై ‘సలార్ 2’పై దృష్టి పెట్టనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాతే ‘సలార్ 2’ పట్టాలెక్కే అవకాశం ఉంది.ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘దేవర’కు సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘దేవర 2’ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయని, త్వరలోనే సెట్స్పైకి వెళ్లే అవకాశముందని సమాచారం. యంగ్ హీరో తేజ సజ్జ కూడా సీక్వెల్స్ రేసులో ముందంజలో ఉన్నాడు. ‘జాంబిరెడ్డి 2’, ‘జై హనుమాన్’, ‘మిరాయ్ 2’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘జై హనుమాన్’లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కీలక పాత్ర పోషించనున్నాడనే వార్త సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది.
చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా రేసులో ఉన్నాయి. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ENE రిపీట్’ పేరుతో రాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన ‘మ్యాడ్’ సిరీస్ ఇప్పటికే రెండు భాగాలతో విజయం సాధించగా, ఇప్పుడు ‘మ్యాడ్ జూనియర్స్’ రూపొందుతోంది. హారర్ థ్రిల్లర్ ‘పొలిమేర 3’ను పాన్ ఇండియా స్థాయిలో తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా ‘పుష్ప 3’, ‘కార్తికేయ 3’, ‘టిల్లు క్యూబ్’, ‘కేజీఎఫ్ 3’ వంటి ప్రాజెక్టులు కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి. వీటిపై అధికారిక ప్రకటనలు ఆలస్యమవుతున్నా… ప్రేక్షకుల్లో మాత్రం భారీ ఆసక్తి ఉంది. మొదటి భాగం విజయాన్ని కొనసాగించడం సీక్వెల్లకు పెద్ద సవాలే. కథ, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ బ్యాలెన్స్గా ఉంటేనే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. అయితే ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం… రాబోయే సీక్వెల్స్ కూడా విజయవంతమైతే టాలీవుడ్లో ఈ ట్రెండ్ మరింత వేగంగా విస్తరించే అవకాశముంది.