స్టార్ హీరోల సినిమాలకు పాటలు కంపోజ్ చేస్తూ కొరియోగ్రాఫర్గా మంచి పేరు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్. సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ..‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో అన్ని పాటలకు నేనే డ్యాన్సులు కంపోజ్ చేశాను. ‘వీరసింహారెడ్డి’లో జై బాలయ్య, సుగుణసుందరి, మా బావ మనోభావాలు పాటలకు కొరియోగ్రఫీ చేశాను. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికే విడుదలవుతాయని ముందు తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కో లిరికల్ సాంగ్స్ విడుదలవుతుంటే టెన్షన్ మొదలైంది.
ఈ రెండు చిత్రాల్లో డ్యాన్సులు ఆకర్షణ అవుతాయి. కొరియోగ్రఫీ విషయానికొస్తే పాటకు ఏం కావాలో ముందు ప్లాన్ చేసుకుంటాం. ఆ తర్వాత హీరో బాడీ లాంగ్వేజ్ను బట్టి మూమెంట్స్, స్టెప్స్ డిజైన్ చేస్తాను. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరిలో ఉన్న అంకితభావం చూసి నేర్చుకోవాలి. సమయపాలన, అనుకున్న స్టెప్ వచ్చేవరకు సాధన చేయడం చూసి ఆశ్చర్యమేస్తుంటుంది. అందుకే వాళ్లు ఇంతకాలం అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారని అనిపిస్తుంటుంది. చిరంజీవి గారి సినిమాలోని ‘నువ్వు శ్రీదేవి’ పాటను పూర్తి మంచులో చేస్తే..బాలకృష్ణ చిత్రంలోని ‘సుగుణసుందరి’ పాటను ఎండలో చిత్రీకరించాం. స్టార్ హీరోలు కాబట్టి వీరితో కలిసి పనిచేస్తున్నప్పుడు మా డ్యాన్సులపై అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాం’ అన్నారు.