“ఒక్కడు’ సినిమా షూటింగ్ కోసం కర్నూల్ వచ్చాను. ఇన్నాళ్లకు మళ్లీ మీ అందరిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ వేడుకకు ప్లాన్ చేశాం. ఇంత మంది వస్తారని అస్సలు ఊహించలేదు. ఈ ఆనందంలో వేదిక మీద డ్యాన్స్ చేశాను. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి’ అన్నారు మహేష్బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమా మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ను సోమవారం ఏపీలోని కర్నూల్ పట్టణంలో నిర్వహించారు. మహేష్బాబు మాట్లాడుతూ ‘అభిమానుల ఆనందాన్ని చూస్తుంటే ఇదొక వందరోజుల వేడుకలా అనిపిస్తుంది. నాన్న ఈ సినిమా చూసి ‘పోకిరి’ దూకుడు’ చిత్రాలను మించిపోతుందని చెప్పారు. అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. ఈ సినిమా విజయం కలకాలం గుర్తుండిపోతుంది’అన్నారు. ‘మహేష్బాబు ‘ఒక్కడు’ సినిమా చూసి దర్శకుడవ్వాలని నిర్ణయం తీసుకున్నా. గొప్ప సినిమా అందిస్తానని ఆయనకు మాటిచ్చాను.
ఈ విజయంతో ఆ మాటను నిలబెట్టుకున్నా. ఈ వేడుకను నా జీవితకాలం గుర్తుపెట్టుకుంటా. ఈ సినిమా కోసం శ్రమించిన నా టీమ్ అందరికి కృతజ్ఞతలు’ అని దర్శకుడు పరశురామ్ చెప్పారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ ‘మహేష్బాబు చూస్తే క్లాస్గా కనిపిస్తారు. కానీ ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్స్ మాత్రం మాస్. మహేష్బాబుపై ఉండే ఇష్టాన్ని పాటల్లో చూపించాను. అందుకే సూపర్హిట్ ఆల్బమ్ క్రియేట్ అయింది’ అన్నారు. ఈ విజయోత్సవ వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో కలిసి మహేష్బాబు స్టెప్పులేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.