ప్రత్యేకగీతాల్ని అందరు మెచ్చేలా జనరంజకంగా తీర్చిదిద్దిడంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ది అందెవేసిన చేయి. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాలో ప్రేక్షకుల్ని హుషారెత్తించే ఐటెంసాంగ్కు చోటుంటుంది. తాజా చిత్రం ‘పుష్ప’లో కూడా సుకుమార్ అద్భుతమైన ప్రత్యేకగీతానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ పాటలో అగ్ర కథానాయిక సమంత నర్తించబోతుండటం విశేషం. ఆమె కెరీర్లో ఇదే తొలి ఐటెంసాంగ్ కాబోతున్నది. ‘పుష్ప’ ప్రత్యేక గీతంలో సమంత భాగం కావడం ఆనందంగా ఉందని చిత్రబృందం ట్విట్టర్లో ఓ ప్రకటన చేసింది. ‘ఈ పాటలో నటించడానికి అంగీకరించిన సమంతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అల్లు అర్జున్తో జోడీగా ఆమె వెండితెరపై సందడి చేస్తుంది. సినిమాలోని ఈ ఐదో గీతం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది’ అని చిత్రబృందం వ్యాఖ్యానించింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో అల్లు అర్జున్తో జోడీగా నటించింది సమంత. సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మరోమారు తెరపై ఆవిష్కృతంకాబోతుండటం విశేషం. ఎర్రచందనం అక్రమ రవాణా ఇతివృత్తంతో రూపొందిస్తున్న ‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకురానుంది. రష్మిక మందన్న కథానాయిక. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై భారీ అంచనాల్ని రేకెత్తిస్తున్నాయి.