చిత్రసీమలో పదిహేనేండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది అగ్ర కథానాయిక సమంత. దక్షిణాదిలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది. అనారోగ్యం బారిన పడినప్పటికి ధైర్యంగా పోరాటం సాగించి కోలుకుంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో విజయ్దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
‘ఫ్యామిలీమెన్-2’ వెబ్ సిరీస్తో హిందీలో కూడా ఆదరణ సొంతం చేసుకున్న సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ సిరీస్ హిందీ రీమేక్లో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం సమంత హాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలిసింది. ‘చెన్నై స్టోరీ’ అనే హాలీవుడ్ చిత్రంలో ఆమె నటించనుంది. హాలీవుడ్ నటుడు వివేక్ కల్రా హీరోగా నటిస్తారు. ఫిలిప్ జాన్ దర్శకుడు. ఇంగ్లాండ్కు చెందిన యువకుడికి, చెన్నై అమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం.