Samantha Clarifies about Rs.250 crore alimony rumour |బాలీవుడ్ మోస్ట్ పాపులారిటీ షో కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ చేస్తున్న ఈ షో ‘డిస్నీ ప్లస్ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ షోకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్, టాలీవుడ్ హీరోయిన్ సమంత హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా? అని టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు తాజాగా ఈ ఎపిసోడ్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నాగచైతన్యతో విడాకులతో పాటు చాలా విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
కాఫీ విత్ కరణ్ షోలో సమంత తన వ్యక్తిగత విషయాలపై పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. నాగ చైతన్యతో పెళ్లి, విడాకులపై వచ్చిన ట్రోల్స్పై తన శైలిలో స్పందించింది. నాగచైతన్యను భర్త అంటూ కరణ్ జోహార్ ఓ ప్రశ్న అడగ్గా.. భర్త కాదు మాజీ భర్త అనమంటూ సలహా ఇచ్చింది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో విడాకుల తర్వాత తను భరణంగా రూ.250 కోట్లు తీసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అలాంటి వార్తలు వచ్చినప్పుడు తన ఇంటికి ఎవరైనా ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు వస్తే బాగుండేదని, వాళ్లైనా జనాలకు నిజం చెప్పేవారని చెప్పుకొచ్చింది.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని కరణ్ జోహార్ అడగ్గా.. దానికి సమంత ‘ఒరిజినల్ గ్యాంగ్స్టార్’ అంటూ ట్యాగ్ ఇచ్చింది. వీటితో పాటుగా టాలీవుడ్ నెపోటిజంపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్లో చాలా మంది హీరోల పిల్లలు, వారి బంధువుల పిల్లలు మాత్రమే హీరోలు అవుతారు. కానీ విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు స్టార్గా మారడం చాలా అరుదు అంటూ చెప్పుకొచ్చింది.