ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘సలార్’ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బొగ్గు గనుల నేపథ్య ఇతివృత్తంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని సోషల్మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి. వీటిపై చిత్రబృందం స్పష్టత నిచ్చింది. ముందస్తుగా నిర్ణయించిన తేదికే సినిమాను విడుదల చేయబోతున్నామని, నిరాధారమైన వార్తల్ని నమ్మొద్దని కోరింది.
ఈ మేరకు ట్విట్టర్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్ అభిమానులు గుర్తుంచుకునే సినిమాగా ‘సలార్’ మిగిలిపోతుందని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఇదిలావుండగా ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.