టిక్కెట్ ధరల పెంపు విషయంలో గత కొన్ని నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో తగ్గించిన టిక్కెట్ ధరలను ఇంకా అలాగే కొనసాగిస్తోంది. గత కొన్ని నెలలుగా సినీ ప్రముఖులతో భేటీలు జరుగుతున్నా ఈ విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
జనవరిలో సంక్రాంతి కానుకగా ‘ఆర్ఆర్ఆర్’తో పాటు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. టికెట్ రేట్లు తగ్గిస్తే వాటికి పెట్టిన బడ్జెట్ కూడా వస్తుందో లేదో అనుమానం కలుగుతుంది. ‘ఆర్ఆర్ఆర్’కి దాదాపు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. టిక్కెట్ ధరలు అలానే ఉంటే నిర్మాతలు చాలా నష్టపోతారు అనేది వాస్తవం.
ఈ క్రమంలో వారు కోర్టుకి వెళతారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తాజాగా స్పందించింది.నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. సినిమా టిక్కెట్ ధరలు తగ్గించడం మా సినిమాపై మాత్రమే కాదు అన్ని సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి మాకు కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు, ఏపీ ముఖ్యమంత్రిని సంప్రదించి మా పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నిస్తాం . సినిమా టికెట్ ధరల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాం అని స్పష్టం చేశారు.