‘ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించిన భావన కలుగుతోంది. సాయితేజ్ను నేనో సోదరుడిగా భావిస్తా. అతడికి సక్సెస్ వస్తే నాకు వచ్చినట్లుగా ఆనందపడతా’ అని అన్నారు దర్శకుడు కొరటాల శివ. ‘రిపబ్లిక్’ చిత్రంలోని ‘ఏయ్ రారో’ అనే పాటను శనివారం హైదరాబాద్లో కొరటాల శివ విడుదలచేశారు. సాయితేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవాకట్టా దర్శకుడు. జె. భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సాయితేజ్ మాట్లాడుతూ ‘సినిమాల్ని థియేటర్లో చూసినప్పుడు కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదలచేయాలనుకుంటున్నాం.
అది ఎప్పుడనేది తెలియదు. తెలుగు ప్రేక్షకులు ఇది వరకటి మాదిరిగానే థియేటర్లకు వచ్చి సినిమాల్ని ఆదరిస్తారనే నమ్మకముంది. మంచి కథ, పాత్రలో నటించే అవకాశాన్ని దేవాకట్టా ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చారు’ అని అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ ‘స్వేచ్ఛ గురించి గొప్పగా పాటలో ఆవిష్కరించారు. దేవాకట్టా తన సినిమాల్లో సున్నితమైన అంశాల్ని లోతుగా, బలంగా ఆవిష్కరిస్తుంటారు. ఈ సినిమాలోని సందేశం అందరినీ మెప్పించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ‘మణిశర్మతో కలిసి పనిచేయాలనే తన కల ఈ సినిమాతో తీరింది. ఈ పాటకు చక్కటి బాణీలను అందించారాయన. నా ఆలోచనల్ని స్వేచ్ఛగా తెరపై చాటే అవకాశాన్ని నిర్మాతలు కల్పించారు’ అని దేవాకట్టా చెప్పారు. తేజ్తో తొలిసారి పనిచేస్తుండటం సంతోషంగా ఉందని మణిశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో భగవాన్, పుల్లారావు, బీవీఎస్ రవి తదితరులు పాల్గొన్నారు.