అగ్ర కథానాయకుడు రవితేజ ‘ఇరుముడి’ సినిమా భక్తి, భావోద్వేగాలతో కూడుకున్న హృద్యమైన తండ్రీకూతుళ్ల ప్రేమకథ అని ప్రచారంలో భాగంగా మేకర్స్ ఇప్పటికే తెలిపారు. అయితే.. ఆ ప్రేమ వెనుక, ఆ భావోద్వేగాల వెనుక, ఆ భక్తి వెనుక రక్తపు మరకలు అంటిన గతం ఉందని, ఆ గతం ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేస్తుందని ఇన్సైడ్ టాక్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘ఇరుముడి’ సినిమా ప్రారంభమే భయానకమైన రక్తపాతంతో కూడి ఉంటుందట. రవితేజపై తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఆయన పాత్రలోని నేరపూరిత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుందట. అయితే.. కూతురు కోసం నేరప్రవృత్తికి స్వస్తి పలికి, అయ్యప్ప దీక్ష తీసుకొని సాత్విక జీవితం గడుపుతుంటాడట. ఇంతలో గత జీవితం తాలూకు వైరం తనకు సమస్యలు సృష్టిస్తుంది.
ఆ సమస్యల్లో తన కూతురు జీవితం కూడా ముడిపడి ఉండటంతో కథ కీలక మలుపు తిరుగుతుందట. ఇలా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా సినిమా సాగుతుందని తెలిసింది. రవితేజ తన పార్ట్ షూటింగ్ని పూర్తిచేసి డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన డబ్బింగ్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘నాకు ఒకే ఒక్క కూతురు.. పేరు మణమ్మ’ అంటూ రవితేజ ఎంతో ఎమోషనల్గా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటున్నది. ఇంకా మూడు రోజుల షూట్ మాత్రమే మిగిలివుందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడాపూర్తి చేసి ఆగస్ట్ 21న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర నటిస్తున్నది. ఈ చిత్రానికి దర్శకత్వం: శివ నిర్వాణ, సంగీతం జీవీ ప్రకాశ్కుమార్, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్.