‘ఒక్కోసారి చెడు కూడా మంచే చేస్తుంది. ‘మైసా’ షూట్లో తగిలిన గాయం ఓ విధంగా నాకు మంచే చేసింది’ అంటూ ఆనందం వెలిబుచ్చారు అగ్ర కథానాయిక రష్మిక మందన్నా. తాజాగా తన గాయం గురించి రష్మిక మాట్లాడుతూ ‘పెళ్లయితే అయ్యిందికానీ.. సినిమా కమిట్మెంట్ల కారణంగా కలిసి ఉండే సమయం మాత్రం మాకు కరువైంది. పెళ్లి జరిగాక మూడునెలల పాటు మేమిద్దరం ఒకరినొకరం చూసుకోలేదంటే నమ్ముతారా!? కేవలం ఫోన్లలోనే మాట్లాడుకునేవాళ్లం. మా అవస్థ చూసి విధికి కూడా బాధ కలిగినట్టుంది. దాంతో నాకు విశ్రాంతి ఇద్దామని ఫిక్స్ అయ్యింది. అందుకే ఈ గాయమైంది కావొచ్చు. వినడానికి వింతగా అనిపించినా.. ఈ సమయం మాత్రం నాకు చాలా నచ్చింది.
ఈ నెలరోజులూ ఇద్దరం ఇంట్లోనే హాయిగా గడిపాం. ‘ఎలాంటి గాయాలూ లేకుండా మనం ఇలా ఎన్నో రోజులు గడపాలి’ అని విజయ్ అనేవాడు. తను ఆటపట్టిస్తుంటే నాకెంతో ఆనందంగా ఉండేది. ఈ విశ్రాంతి రోజులన్నీ నాకు అద్భుతమైన జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. నాకు కొరియన్ డ్రామాలంటే పిచ్చి. విజయ్కేమో సీరియస్ డ్రామాలు, షోలు ఇష్టం. ఈ ఖాళీ టైమ్లో ఇద్దరం కలిసి రెండూ కవర్ చేశాం’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు రష్మిక. ఇదిలావుంటే.. గాయం నుంచి కోలుకున్న రష్మిక తిరిగి మళ్లీ షూటింగ్స్తో బిజీ కానున్నారు. ఇప్పటికే ముగింపు దశలో ఉన్న ‘మైసా’ చిత్రాన్ని ఆమె పూర్తి చేయనున్నారు. నవంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానున్నది. ఇక తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటిస్తున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే.