Ram Charan | మాస్ మహారాజ రవితేజకు ఇటీవల మంచి విజయాన్ని అందించిన చిత్రం ‘ఇరుముడి’. గత నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ సక్సెస్ఫుల్గా దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు శివ నిర్వాణ ‘ఇరుముడి’ సీక్వెల్పై క్లారిటీ ఇచ్చారు. సినిమా హిట్ అయిందనే కారణంతో వెంటనే రెండో భాగం గురించి ఆలోచించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఇరుముడి’ కథకు కొనసాగింపు ఉండే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు శివ నిర్వాణ ఆసక్తికరంగా స్పందించారు.
సినిమా సక్సెస్ అయ్యిందని వెంటనే సీక్వెల్ కథ రాయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. కథకు సహజంగానే మరో భాగం అవసరమని అనిపిస్తేనే దాని గురించి ఆలోచిస్తానని చెప్పారు. అలాంటి అద్భుతమైన విషయం ముందుగా కథలోనే రాసిపెట్టి ఉండాలని, మనం అనుకున్నంత మాత్రాన అలాంటివి జరగవని పేర్కొన్నారు. ఇరుముడి’లో మద్యపానానికి అలవాటు పడిన ఓ వ్యక్తి తన కూతురి కోసం మాల వేసుకుని 41 రోజుల దీక్ష చేపట్టినప్పుడు.. ఆ దీక్షలో అతడిని పూర్తిగా మార్చే సంఘటనలు ఏమిటన్న కాన్సెప్ట్ చుట్టూనే కథను రూపొందించినట్లు శివ నిర్వాణ తెలిపారు. అందువల్ల ఈ కథకు సహజమైన కొనసాగింపు దొరికితేనే సీక్వెల్ గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు.
‘ఇరుముడి’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నారంటూ గతంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తర్వాత శివ నిర్వాణ స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై కూడా దర్శకుడు స్పందిస్తూ.. రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగిందని, అయితే అది నిజం కాదని తాము స్పష్టం చేశామని తెలిపారు. రామ్ చరణ్ సినిమాలో భాగమై ఉంటే అది అద్భుతంగా ఉండేదని, కానీ ఇలాంటి విషయాలు మనం అనుకున్నంత మాత్రాన జరగవని అన్నారు. అవి కథలో సహజంగా భాగమయ్యేలా ఉండాలని, అప్పుడే అలాంటి కలయికలు అద్భుతంగా అనిపిస్తాయని పేర్కొన్నారు.