మరో ప్రముఖ తార వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నది. రకుల్ ప్రీత్సింగ్ పెండ్లి సన్నాహాలు చేసుకుంటున్నట్లు బాలీవుడ్ సమాచారం. ప్రియుడు జాకీ భగ్నానీతో త్వరలోనే ఆమె వివాహం జరగనుందట. ఈ ఏడాది ప్రారంభంలో తమ ప్రేమ సంగతి వెల్లడించారీ జంట. తరుచూ పలు ఈవెంట్స్లో కలిసి కనిపిస్తున్నారు. పెండ్లి విషయంపై సూటిగా చెప్పని రకుల్ తాజాగా స్పందిస్తూ…‘మేమిద్దరం ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటాం. ఎవరి కెరీర్లో వాళ్లం బిజీగా ఉన్నాం. మా జీవితాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కలిసే, ఏకాభిప్రాయంతో తీసుకుంటాం. ఏమైనా అతను నా జీవితానికి లభించిన గొప్ప బహుమతిగా భావిస్తా’ అని పేర్కొంది. కొన్నేండ్లు తెలుగు తెరపై వరుస విజయాలతో అగ్రతారగా వెలిగింది రకుల్. ఆ మధ్య క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్కు దూరమైంది. ప్రస్తుతం కమల్ హాసన్తో ‘ఇండియన్ 2’, దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నది. ఇవి కాక హిందీలో ‘ఛత్రివాలి’, ‘మేరీ పత్నీ కా రీమేక్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నది.