మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రాలలో రాక్షసుడు ఒకటి. ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ చిత్రాల తరువాత చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో కె.ఎస్.రామారావు నిర్మించిన ‘రాక్షసుడు’ 1986 అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా విడుదలైంది. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘రాక్షసుడు’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా బాణీలు భలేగా సందడి చేశాయి.
ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఈ చిత్రంలోని ఐదు పాటలను వేటూరి పలికించారు. ఇందులోని మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు…, “హే నాటీ లవ్ బోయ్…”, “అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా…”, “గిలిగా గిలిగిలిగా గిలిగింతగా…”, “నీ మీద నాకు ఇదయ్యో…” వంటి పాటలు భలేగా ఆకట్టుకున్నాయి. సుహాసిని, రాధ, జయమాల, టైగర్ ప్రభాకర్, రావు గోపాలరావు, రాజేంద్రప్రసాద్, అన్నపూర్ణ, సుమలత, సంయుక్త, ఎమ్.వి.ఎస్.హరనాథరావు, నర్రా, పి.జె.శర్మ, జగ్గారావు తదితరులు తమ పాత్ర మేర నటించారు.
నేటితో రాక్షసుడు చిత్రం విడుదలై 35 సంవత్సరాలు కాగా, చిరంజీవి అభిమానులు , చిత్రబృందం సినిమాలకు సంబంధించిన విశేషాలను నెమరవేసుకుంటున్నారు. ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా వచ్చినా, ఆ యేడాది మరో వారానికే దసరా పండగ రావడంతో ‘రాక్షసుడు’ మంచి వసూళ్ళు చూసింది.