సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ స్టార్స్ ఒక్కొక్కరుగా కన్నుమూస్తుండడం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్ను మూశారు. 64 ఏండ్ల రాజబాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కమారులు, కుమార్తె ఉన్నారు.
రాజబాబు స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసాపురపేట. రంగస్థల నటుడిగా ఆయన తన నట జీవితాన్ని ప్రారంభించారు. పలు సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. 1995లో వచ్చిన ఊరికి మొనగాడు చిత్రంతో రాజబాబును సినిమా రంగానికి పరిచయం అయ్యారు.
రాజబాబుకి నటన అంటే చాలా ఇష్టం.బాల్యం నుండే రంగస్థలంపై నటించడం మొదలు పెట్టాడు. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారీ, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు. దాదాపు 62 చిత్రాలలో నటించిన ఆయన విభిన్నమైన పాత్రలు పోషించారు.
పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు రాజబాబు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి వంటి సీరియల్స్ నటించిన ఆయనకు నంది అవార్డ్ కూడా దక్కింది. రాజబాబును అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు పెద్ద షాకింగ్గా మారింది. రాజబాబు మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.